ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. అన్నట్టుగా జగన్ తనపై పడ్డ క్రిస్టియన్ అనే మచ్చను పోగొట్టుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అయితే, ఇదంత వర్కవుట్ అయ్యే విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి జగన్ తండ్రి వైఎస్ ఎప్పుడూ తాను క్రిస్టియన్ అని అనిపించుకునేలా ఎక్కడా ప్రయత్నించలేదు. అయితే, జగన్ మాత్రం మెడలో క్రైస్తవ శిలువను ధరించడం, ఆయన తల్లి విజయలక్ష్మి ఏకంగా బైబిల్నే పట్టుకుని ప్రసంగాలు చేయడం, ప్రజల్లోకి వెళ్లడం, ఇక, జగన్ బావ క్రిస్టియన్ ఫాదర్ కావడంతో కుటుంబం మొత్తం.. క్రిస్టియానిటీనే అనుసరిస్తోందని స్పష్టమవుతోంది.
అయితే, హిందువుల శాతం ఎక్కువగా ఉన్న ఏపీలో ఇలా ఓ మతానికి చెందిన వ్యక్తిగా జగన్ ప్రచారం కావడం వల్లే 2014లో ఓటమిపాలయ్యారనే విశ్లేషణలు వైసీపీలో ఉన్నాయి. దీంతో జగన్ ఇక తాను మారాల్సిందేనని నిర్ణయించుకుని హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, తాను హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు నానా తిప్పలు పడుతున్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో శాస్త్రోక్తంగా తన తండ్రికి పిండ ప్రదానం చేశారు. అదేవిధంగా గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో పలువురు పీఠాధిపతులను కలిశారు. స్వామీజీలకు పాదనమస్కారం చేశారు. ఈ క్రమంలోనే చినజీయర్ స్వామికి జగన్ నమస్కరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
అంతేకాదు పార్టీకి సంబంధించి కీలకమైన అంశాల్లోనూ జగన్ స్వామీజీల సూచనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మాటను పాటిస్తున్నారు. గతంలో జరిగిన యాగంతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం రిషికేశ్ లో జరిగిన పూజల్లోనూ జగన్ పాల్గొన్నారు. తాజాగా స్వరూపానందేంద్రస్వామి సూచనల మేరకే పాదయాత్ర తేదీలను జగన్ మార్చుకున్నట్లు సమాచారం. మొదట ప్రకటించిన ప్రకారం.. అక్టోబర్ 26 నుంచి పాదయాత్ర చేయాలి. అయితే, ఆ ముహూర్తాన్ని స్వరూపానంద రద్దు చేశారని సమాచారం.
అంతేకాకుండా.. నవంబరు 2ను నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ అందుకు అనుకూలించే ఏ ఒక్క అవకావాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నారు. మరి జగన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.