తెలంగాణలో జెట్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ఆరేడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజకవర్గాల ఇన్చార్జ్లు ఉన్నా వారిని వచ్చే ఎన్నికల్లో నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి కొత్తవారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్పటికే ఓ పెద్ద ప్రణాళికను కూడా కేసీఆర్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో పదే పదే చెబుతున్నా కొందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోవడం, స్థానిక అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేకపోవడంపై ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ అలాంటి వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావన్న ప్రచారం బయటకు వచ్చేసింది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కష్టమని టాక్? వీరిలో కోవ లక్ష్మి, అజ్మీరా రేఖా నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.
యాదాద్రి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను తప్పించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను లైన్లో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మెదక్ నుంచి ఆంథోల్ ఎమ్మెల్యే బాబుమోహన్పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయనకు బదులుగా కాంగ్రెస్కు చెందిన దామోదర రాజనర్సింహను లైన్లో పెడుతున్నారు. అయితే ఆయన డిమాండ్లు క్లిష్టంగా ఉండడంతో ఇప్పుడు ఆ ప్రతిపాదన పెండింగ్లో పడినట్లు సమాచారం. ఇక నల్గొండ జిల్లాలోను ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెక్ పెడుతున్నారట.
అలాగే పాత మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్లో పనిచేసిన ఓ కీలక నేత కూడా పార్టీలోకి వస్తానంటున్నట్టు సమాచారం. అయితే ఇందుకు కేసీఆర్ ఇంకా గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలపై కూడా గులాబీ బాస్ వలవిసురుతున్నట్టు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్, ఖమ్మం జిల్లాలో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కలను కూడా పార్టీలోకి తీసుకునేందుకు తెర వెనక పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయట.