ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితేనే చాలు టీడీపీకి కంచుకోట అన్న థాట్ ప్రతి ఒక్క ఓటర్కు వస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తన ఆధిపత్యం చూపించింది. ఇక్కడ సాధారణ ఎన్నికల్లో టీడీపీ క్లీన్స్వీప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు, 2 ఎంపీ సీట్లు టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఎదురీత తప్పడం లేదు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం ఓ కారణంగా కనిపిస్తున్నా దానికంటే అధికార పార్టీలోని గ్రూపుల గోల, వర్గ రాజకీయాలను పార్టీని సర్వనాశనం చేసేస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని 15 సీట్లూ మళ్లీ టీడీపీయే గెలుచుకుంటుందా ? అని ప్రశ్నిస్తే టీడీపీ వాళ్లే నో అంటున్నారు. టీడీపీ వాళ్ల సంగతి ఇలా ఉంటే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ ఇటీవల చేసిన సీక్రెట్ సర్వే ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ఫలితాల్లో మళ్లీ టీడీపీదే అధికారం అని ఆయన జగన్తో చెప్పినట్టు కూడా టాక్ నడుస్తోంది. ఈ ఫలితాలను టీడీపీ వాళ్లు కూడా పదే పదే షేర్లు చేస్తూ, దీనిపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే జిల్లాలో టీడీపీకి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై కిషోర్ సర్వే ప్రకారం టీడీపీ 9, వైసీపీ 4, జనసేనకు 2 సీట్లు వస్తాయని తేలింది. 15 సీట్లలో టీడీపీ 9 సీట్లకు పరిమితమైతే ఈ సారి 6 సీట్లను కోల్పోయినట్టే అవుతోంది. మరి ప్రశాంత్ సర్వే ప్రకారం జిల్లాలో టీడీపీ ఈ సారి ఓడిపోయే ఆ 6 సీట్లు ఏవి అన్నది కూడా అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ సర్వేను విశ్లేషిస్తే జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క మెట్ట ప్రాంతంలోనే టీడీపీ మూడు సీట్లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో టీడీపీ గ్రూపుల గోలతో చాలా దిగజారింది. ఇక్కడ క్యాండెట్లను మార్చకపోతే టీడీపీ రెండు సీట్లు కోల్పోవడం ఖాయం. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలుగా విడిపోయారు. మరో పట్టణ కేంద్రమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైతం గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నాడు.
జిల్లాలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు సీట్లలో రెండు సీట్లలో సైతం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతారనే అంటున్నారు. ఓ జనరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి, ఆయన సోదరుడికి టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తే గెలుపు కష్టమే.
ఇక జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఓ మంత్రి నియోజకవర్గంలో వైసీపీ గెలుపు గ్యారెంటీయే అన్న చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లోనే చావుతప్పి కన్నులొట్టబోయినట్టు గెలిసిన సదరు మంత్రి ఇప్పుడూ అంతే స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు. ఇక జనసేన డెల్టాలోని మూడు పట్టణ నియోజకవర్గాలతో పాటు మెట్టలోని ఓ పట్టణ కేంద్రం నియోజకవర్గంలో గట్టి ప్రభావం చూపనుంది. ఈ నాలుగు సీట్లలోనే జనసేన ఏదైనా ఒకటి ఆరా సీట్లు గెలవచ్చు..గెలవకపోవచ్చు.