అవును! టీఆర్ ఎస్కు పెట్టని కోట భువనగిరిలో కేసీఆర్కు అత్యంత ఆప్తుడు, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సెంట్రిక్గా ఇప్పుడు పొలిటికల్ సీన్ రగులుతోంది! జిల్లా మొత్తంమీద ఇప్పుడు శేఖర్ గురించే ప్రతి ఒక్క నాయకుడూ మాట్లాడుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. నయీం నుంచి ఇతనికి ప్రాణ గండం ఉండడమే! అయితే, నయీం హతమై కూడా పదినెలలు గడిచిపోయాయి కదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. కానీ, నయీం అనుచరులు ఇంకా బతికే ఉన్నారుకదా? అందుకే ఇప్పుడు చర్చంతా శేఖర రెడ్డిమీదకి మళ్లింది.
నిజాయితీ పరుడైన శేఖర్ రెడ్డి.. నయీంపై గతంలో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో నయీం అనుచరులు ఓ ఫైన్ డే నాడు.. తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిన శేఖర్ రెడ్డి.. విషయాన్ని కేసీఆర్ చెవిలో వేయడంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు, 1+ 5 సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇంత వరకుబాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇటీవల ఈ సెక్యూరిటీని తొలిగించారు. అయితే, దీనిని శేఖర్ రెడ్డికి చెప్పే చేశారా? లేక ఏదైనా ఎవరైనా తెర వెనుక చక్రం తిప్పారా? అనేది ఇప్పుడు అసలు సిసలు చర్చగా మారింది.
అయితే తానే కావాలని అదనపు భద్రతను వెనక్కు పంపానని ఎమ్మెల్యే చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే ఆ పని నయీం చనిపోయినప్పుడే చేసి ఉండాల్సింది కదా అని అనుకుంటున్నారట చాలామంది. ఏదేమైనా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల కు అదనపు భద్రత తొలగించడం వెనక ఎదో మతలబు ఉందని, అంతర్గత రాజకీయలవల్లే ఇలా జరిగి ఉంటుందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇదంతా కేసీఆర్కు తెలిసే జరిగిందా? తెలియకుండా జరిగిందా అన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.