టీఆర్ ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాస్ గౌడ్కు సాక్షాత్తూ.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు సంబంధంలేని విషయంలో కలుగ జేసుకని ఏపీ, తెలంగాణల మధ్య వివాదం వచ్చేలా చేస్తున్నారని శ్రీనివాస్పై కేటీఆర్ ఆగ్రహించారట. మరి ఈ విషయంలోకి వెళ్లిపోతే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అనుమతులపై ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తెలంగాణలో అనుమతులు లేకుండా విచ్చల విడిగా తిరుగుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.
అయితే, ఇదే సమయంలో తెలంగాణకు చెందిన ట్రావెల్స్ బస్సులపై ఏపీలో ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. ఇది చిలికి చిలికి రాజకీయ దుమారంగా మారింది. ఆన్ది డే రియాక్ట్ అయిన జేసీ.. ఈ విషయంపై చర్చించేందుకు నేరుగా హైదరాబాద్లోని ఆర్టీవీలో ఆఫీస్కే వస్తానని, తాను అన్ని అనుమతులూ తీసుకునే బస్సులు తిప్పుతున్నానని అన్నారు. అనుకున్నట్టే ఆర్టీవీ ఆఫీస్కి జేసీ రావడం, మంగళవారం పోలీసులు ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. దీంతో ఈ విషయం ఏపీ, తెలంగాణ సమస్యగా మారింది. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇరు పక్షాలూ.. ఈ కొత్త సమస్యతో అవాక్కయ్యాయి.
దీంతో వెంటనే జోక్యం చేసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో.. సంబంధం లేని విషయంలో ఎందుకు జొక్యం అంటూ క్లాస్ ఇచ్చాడట. దీంతో వెనక్కితగ్గిన శ్రీనివాస్గౌడ్.. ఈ సమస్యపై మంత్రి స్పందిస్తానని హామీ ఇచ్చారంటూ ముగింపు పలికారు. కానీ, ఈ అంశాన్నిలేవనెత్తడం వెనుక శ్రీనివాస్గౌడ్ పెద్ద స్కెచ్ వేశారని తెలిసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డిని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల విషయాన్ని సభలో లేవనెత్తారని సమాచారం. రవాణా ఉద్యోగుల బదలీల్లో తన సిఫార్సులకు మంత్రి స్పందించని కారణంగా దానిని మనసులో పెట్టుకునే.. శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంపై గందరగోళం సృష్టించారని అంటున్నారు. మొత్తానికి కేటీఆర్ వార్నింగ్తో పరిస్థితి చక్కబడిందట.