బాబు ‘విజన్’ వర్కౌట్ అవుతుందా? జనం పట్టించుకోవట్లేదా?

ముందుచూపు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరంటే అంతా చంద్రబాబు పేరే చెబుతారు. ఎందుకంటే ఆయన భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారు. భవిష్యత్‌లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లానింగ్‌తో పనిచేస్తారు. అధికారంలో ఉన్న ప్రతిసారి విజన్ ప్రకారం పనిచేస్తారు. 1999 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ముందుకెళ్లారు.

అంటే 2020కి ఏపీ దేశంలోనే అగ్రపథంలో నిలవాలనేది బాబు ప్లాన్. ఆ దిశగా పనిచేశారు. కానీ 2004లోనే అధికారం కోల్పోయారు. బాబు విజన్ 2020కి ప్రజలు మద్ధతు తెలపలేదు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయాక ఏపీలో గెలిపించారు. ఇక ఈ సారి 2029కల్లా ఏపీని దేశంలోనే నెంబర్ 1గా తీర్చుదిద్దుతామని అన్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. 2019లో ప్రజలు ఓడించారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బాబు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగష్టు 15న విశాఖలో విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తానే టెక్నాలజీని పరిచయం చేశానని, హైదరాబాద్‌ని అభివృద్ధి చేశానని, ఐటీ తెచ్చానని కాసేపు డప్పు కొట్టుకున్నారు. విజన్ 2047 అని చెప్పి..ఆనాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు.  చైనాను కూడా అధిగమించి ముందుకువెళ్లే శక్తి మన దేశానికి ఉందఇన్, దేశంలో, రాష్ట్రంలో అవినీతిని, నేరాలను నియంత్రిస్తే సంక్షేమం, అభివృద్ధి వాటంతట అవే పోటీ పడతాయని చెప్పుకొచ్చారు. మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇవ్వాలని, అన్ని కులాల అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని చెప్పారు. యువత దేశ సంపద అని, రాబోయే వందేళ్లు ప్రపంచాన్ని భారతే ఏలుతుందన్నారు.

అయితే బాబు విజన్ ఎప్పుడు పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగే ఇప్పుడు విజన్ 2047 అని చెప్పిన ప్రజలు పట్టించుకోని పరిస్తితి. విశాఖలో బాబు సభకు వచ్చిన వారు కూడా త్వరగా వెనుదిరిగారు. కాబట్టి బాబు విజన్‌ని జనం పట్టించుకునేలా లేరు.