టీడీపీ నేతలతో సుజనా..బీజేపీకి దగ్గర చేస్తున్నారా?

ఏపీ బీజేపీలో రెండు రకాల వర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఒక వర్గం జగన్‌కు సానుకూలంగా ఉంటే…మరొక వర్గం చంద్రబాబుకు సానుకూలంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తుకు రెడీ అవుతున్న నేపథ్యంలో బి‌జే‌పిలో కొందరు నేతలు..ఆ రెండిటితో పొత్తు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు.

అంటే బాబుకు అనుకూలంగా ఉన్నవారు టి‌డి‌పితో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా పనిచేస్తున్నారు. కానీ బాబుకు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా ఉన్న వారు మాత్రం టి‌డి‌పితో పొత్తు ఉండదని, అసలు పొత్తు ప్రసక్తే లేదని చెప్పేస్తున్నారు. జనసేన కలిసొస్తే ఓకే లేదంటే బి‌జే‌పి ఒంటరిగానే ఎన్నికలకు వెళుతుందని అంటున్నారు. ఇక్కడ బి‌జే‌పి ప్లాన్ ఏంటంటే ఓట్లు చీల్చి టి‌డి‌పికి నష్టం, వైసీపీకి లాభం చేయాలని చూస్తున్నారు. ఈ ప్లాన్ అంతా బి‌జే‌పిలో జగన్ కు అనుకూలంగా ఉండేవారు చేస్తున్నది.

కానీ వారి  ప్లాన్ కు బాబుకు అనుకూలంగా ఉండేవారు గండి కొట్టి టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. అందులో సుజనా చౌదరీ, సి‌ఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు లాంటి వారు టి‌డి‌పితో  పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుజనా..టి‌డి‌పి నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

సుజనా చౌదరి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి వచ్చారు. ఈ నేపధ్యంలో ఆలపాటి ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా పాల్గొన్నారు. వీరు పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. అయితే సుజనా ఎప్పటినుంచో టి‌డి‌పిని బి‌జే‌పికి దగ్గర చేయాలని చూస్తున్నారు..అందులో భాగంగా భేటీ జరిగిందా? లేక సుజనా టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారనేది తెలియాల్సి ఉంది.