పుట్టిన ప్రతీ ఒక్కరు మరణించక తప్పదు. పోయిన వాళ్లంత ఉన్నవాళ్లకు తీపి గుర్తులుగా మిగిలిపోతుంటారు. ప్రస్తుతం నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన రోహిణి ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఆమె భర్త గురించి చెప్పాలంటే అతను ఎవరో కాదు ప్రముఖ నటుడు రఘువరన్. ఈయన విలక్షణ నటుడు అన్న పదానికి బ్రాండ్ అని పేర్కొవచ్చు.
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్యమైన చిత్రాలలో నటించి మెప్పించిన నటుడు రఘువరన్. తమిళంలో పూవిళి వాసలిలే, మనిదన్, ఎన్ బొమ్మ కుట్టి అమ్మావుక్కు, అంజలి, బాషా వంటి పలు చిత్రాల్లో తనదైనశైలిలో నటించి ఆ చిత్రాల విజయంలో భాగమయ్యారు. అలాంటి గొప్ప నటుడు అర్ధాంతరంగా చనిపోవడం దురదృష్టకరం.
నటుడు రఘువరన్, నటి రోహిణి 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో కొన్ని మనస్పర్థలు కారణంగా ఇద్దరూ విడిపోయారు. రఘువరన్ 2008 మార్చి 19వ తేదీన మరణించారు. ఆయన వర్ధంతి సందర్భంగా నటి రోహిణి ఆమె భర్తని తలచుకుంటూ, రఘువరన్ తమ బిడ్డతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఫోటోను షేర్ చేస్తూ ‘రఘువరన్ జీవించి ఉంటే ఇప్పటి సినిమాలు చూసి ఆయన కచ్చితంగా ఇష్టపడే వారని, ఒక నటుడుగా చాలా సంతోషించేవార’ని ఆమె ఎంతో ఉద్వేగంతో ట్వీట్ చేసింది . రోహిణి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.