పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్నారు. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం `ప్రాజెక్ట్ కె` షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు శివరాత్రి పండుగ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు నందమూరి తారకరత్నకు ఓ సంబంధం ఉంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించాల్సి ఉందట.
ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాత అశ్వినీ దత్ స్వయంగా వెల్లడించారు. ప్రాజెక్ట్ కెలో తారకరత్నకు మంచి రోల్ ఆఫర్ చేద్దామనుకున్నామని, ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్తోనూ చర్చించినట్లు అశ్వినీ దత్ తెలిపారు. ఈ రోల్ గురించి తారకరత్నతో సంప్రదిద్దామనుకునేలోపే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గుండె పోటు కారణంగా ఆసుపత్రిలోకి అడ్మిట్ అయిన తారకరత్న.. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడాడు. శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.