టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో పర్వాలేదు అనిపించిన నాగార్జున.. ఆ తర్వాత చేసిన ది ఘోస్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ నాగార్జునకు భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఆలోచనలో పడిన నాగార్జున ఈసారి ఎలాగైనా హిట్ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
అందులో భాగంగానే వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కాంబోపై గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్.. ఇక నాగార్జునతో ఓ మలయాళీ సూపర్ హిట్ ఫిలిమ్ ని రీమేక్ చేయబోతున్నారు.
మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ వరకు మలయాళ రీమేక్ లని ఎంచుకుంటున్న సమయంలో కింగ నాగార్జున కూడా మలయాళ రీమేక్ నే నమ్ముకుంటున్నారట. న్యూ డిల్లీ అంతీమ తీర్పు వంటి సంచలన చిత్రాల దర్శకుడు జోషీ 2019లో రూపొందించిన మూవీ ‘పెరింజు మరియమ్ జోస్’. 2019 ఆగస్టు 23న విడుదలైన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. జోజు జార్జ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాని నాగార్జున తెలుగులో చేయబోతున్నారట.
ఇప్పటికే రీమేక్ హక్కుల్ని కూడా సొంతం చేసుకున్నారని తెలుగు నేటి విటీకి అనుగుణంగా ప్రసన్న కుమార్ బెజవాడ మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిసింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. విభిన్నమైన యాక్షన్ డ్రామాగా తెరపైకి రానున్న ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో అల్లర నరేష్ తో పాటు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా నటించనున్నట్టుగా తెలుస్తోంది.
అల్లరి నరేష్ కీలకమైన ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ఈ క్యారెక్టర్ సినిమాకు అత్యంత కీలకమని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం అథికారికంగా ప్రకటించనుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరపైకి తీసుకురానున్నారని నాగార్జున క్యారెక్టర్ కూడా ఇందులో కొత్తగా వుంటుందని చెబుతున్నారు.