నయనతార భర్త, కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ కు స్టార్ హీరో అజిత్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది నెలల క్రితం విఘ్నేష్ శివన్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఎంతో ఆనందంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల `తునివు` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్.. తన తదుపరి చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ట్ చేయాలని భావించాడు.
అజిత్ కెరీర్ లో తెరకెక్కబోయే 62వ ప్రాజెక్ట్ ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అజిత్ 62వ సినిమా నుంచి విఘ్నేష్ శివన్ తప్పుకున్నాడట. విఘ్నేష్ శివన్ చెప్పిన స్క్రిప్ట్ అజిత్ కు పూర్తి స్థాయిలో నచ్చలేదట. పలు చోట్ల ఆయన మార్పులు, చేర్పులు సూచించారట.
అయితే తన స్క్రిప్ట్ లో మార్పులు చేసేందుకు తను ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలోనే విఘ్నేష్ శివన్ ను తప్పించాలని అజిత్ లైకా వారికి సూచించాడట. దాంతో విఘ్నేష్ ను తొలగించి అజిత్ తదుపరి చిత్రం కోసం మగిజ్ తిరుమేనిని లైన్ లోకి తీసుకొచ్చాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ‘తడమ్’, ‘కలగ తలైవన్’ సినిమాలతో మగిజ్ తిరుమేని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతడి దర్శకత్వంలోనే అజిత్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. మొత్తానికి విఘ్నేష్ శివన్ ను ఊరించి చివరకు అజిత్ ఉసూరుమనిపించాడని టాక్ నడుస్తోంది.