ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిరివెన్నెల చివరిగా పాడిన పాట ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమన్ హీరోగా నటించిన `పట్టుదల` అనే సినిమాలోని `ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి` అంటూ సాగే స్ఫూర్తి గీతాన్ని సిరివెన్నెల చివరిగా ఆలపించారు.
మనిషి పట్టుదల వీడకూడదు.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదనే స్ఫూర్తిని నింపుతూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. కాగా, మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర మొదలుకానుంది. మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు జరగబోతుండగా.. అందుకు ఏర్పాట్లు అన్నీ చకచకా జరుగుతున్నాయి.
ఇక ప్రస్తుతం అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తీసుకొచ్చారు. దీంతో ఆయన కడసారి చూపు కోసం సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు ఫిల్మ్ ఛాంబర్కు తరలివస్తున్నారు.
https://youtu.be/4PowL1vadYo