టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని తాజాగా ప్రకటించాడు. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్తో ముచ్చటగా మూడోసారి పని చేయబోతున్నాడు గోపీచంద్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గోపీచంద్ 30వ చిత్రాన్ని పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
మరి భూపతిరాజా అందిస్తున్న ఈ కథతో శ్రీవాస్ – గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి. కాగా, గోపీచంద్ నటించిన సీటీమార్ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు మారుతి దర్శకత్వంలో పక్కా కమెర్షియల్ అనే చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.