తెలంగాణ రాజకీయాల్లో సంచలన ఘటన జరిగింది. అదరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొదటగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈటల.. ఆ తర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లెటర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడం విశేషం.
ఆ వెంటనే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. అయితే తెలంగాణ ఏర్పాటయిన ఏడేళ్ల తరువాత ఒక ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. పదవీ కాలం ఉండగానే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2008 , 2010లో రెండు సార్లు ఎమ్మెల్యే ఈటల ఉద్యమం కోసం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది మూడోసారి అయింది.