చిరంజీవి నిర్మాతకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో మరో కేసు నమోదు..

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ” భోళా శంకర్ “. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కోట్లలో నష్టపోయారు. దాదాపు యాభై కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ట్రెండ్ వార్తలు చెబుతున్నాయి. అయితే సినిమా డిజాస్టర్ కాగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టారు. వీరితోపాటు మరి కొందరు కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.

తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(సతీష్).. తనని నిర్మాతలు మోసం చేశారని హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో చీటింగ్ కేసు వేశారు. కేసు వేసిన అనంతరం డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ…” అఖిల్ హీరోగా నటించిన ‘ ఏజెంట్ ‘ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారు. ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం రూ. 30 కోట్లు వైట్ అమౌంట్ ను బ్యాంకు నుంచి తను చెల్లించాను. కానీ తనకు కేవలం విశాఖపట్నం హక్కులను మాత్రమే ఇచ్చారు. దీని గురించి నిర్మాతలను కలిసినప్పుడు ‘ భోళా శంకర్ ‘ సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారు.

ఇక ఇండస్ట్రీతో తనకున్న అనుబంధంతో ఇన్నాళ్లు ఫోర్స్ చెయ్యలేదు. కానీ కనీసం తనతో వాళ్లు మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేనందుని తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాను “అని తెలిపాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇక వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని సతీష్ అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు.