తనికెళ్ళ భరణి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనికెళ్ళ భరణి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో పరుపురాని పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో 800 చిత్రాల్లో నటించారు.
యాభైకి పైగా సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇప్పటికీ తన నటనా జీవితాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న తనికెళ్ళ భరణి.. పెదకాపు 1 మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ళ భరణి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఒక ఏడాదిలో 18 సినిమాలు వదులుకున్నానని తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చారు. అందుకు కారణం కూడా ఆయన తెలిపారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. `నటుడిగా ఇప్పటివరకు దాదాపు 800 సినిమాలు చేస్తే అందులో 300 సినిమాలు కేవలం తండ్రి పాత్రలే చేశాను. దీంతో తండ్రి పాత్రలు అంటేనే విసుగొచ్చేసింది. అందుకే ఈ ఏడాది 18 సినిమాలు వదిలేశా. అవన్నీ తండ్రి పాత్రలే. ఇకపై కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్నాను. పెదకాపు సినిమాలో స్కూల్ టీచర్ పాత్ర రావడంతో ఒప్పుకున్నాను` అని పేర్కొన్నారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.