ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే అస్సలు ముందుకు రారు. అందుకే తెలుగులో ఇలాంటి చిత్రాలకు పక్క భాషల నుంచి హీరోలను పట్టుకొస్తూ ఉంటారు. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గుణుశేఖర్.. టాలీవుడ్ హీరోలకు తనదైన శైలిలో చురకలు వేశారు.
`శాకుంతలంలో దుష్యంతుడి పాత్రకు మన హీరోలు ఒప్పుకోరు. కేవలం హీరో పాత్ర ప్రధానంగా సాగితేనే కథపై మక్కువ చూపుతుంటారు. అందుకే మన హీరోలను అడిగి లేదనిపించుకోవడం ఇష్టం లేక మలయాళ నటుడు దేవ్ మోహన్ ను ఎంపిక చేశాము. అదే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు అతిధి పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు. ఈ విషయంలో మన హీరోలు ఇకనైనా మారాలి.` అంటూ గుణశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.