టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన హీరోయిన్ల జాబితాలో తాప్సీ ఒకటి. అయితే బాలీవుడ్ లోనూ తాప్సి సక్సెస్ అయింది. స్టార్ హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. కెరీర్ ఆరంభంలో తాప్సీ మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ సమయంలో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. కాంటెస్ట్ సమయంలో తాప్సీ ఉంగరాలు జుట్టు అంటూ అక్కడి వారు హేళన చేశారట.
ఇలాంటి హెయిర్ స్టైల్తో మిస్ ఇండియా టైటిల్ గెలవడం అసాధ్యమని నిరుత్సాహ పరిచారట. మరోవైపు కొన్ని కార్పొరేట్ సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు తాప్సీ వద్దకు వచ్చి `ఒకవేళ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంటే తమ సంస్థల తరపున మూడేళ్ల పాటు పనిచేయాలని, ముప్పై శాతం ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది` అని భయపెట్టారట. ఆ రోజుల్ని తలచుకుంటే ఓ పీడకలలా అనిపిస్తుందని తాజాగా తాప్సీ చెబుతూ ఎమోషనల్ అయింది.