కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జ్యోష్లో ఉన్న హీరో నిఖిల్ సిద్ధార్థ.. ప్రస్తుతం `స్పై` అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నిఖిల్ కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా నిఖిల్ భార్య పల్లవి వర్మతో కలిసి `అలా మొదలైంది` అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ షోకు హోస్ట్ గా మారాడు. ఫస్ట్ ఎపిసోడ్ కు నిఖిల్ దంపతులు గెస్ట్ గా విచ్చేశారు. ఈ ఎపిసోడ్ మార్చి 28న ఈటీవీలో ప్రసారం కానుంది. తాజాగా ప్రోమోను బయటకు వదిలారు. అయితే ఈ కార్యక్రమంలో నిఖిల్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది పల్లవి.
నిఖిల్-పల్లవిలతో వెన్నెల కిషోర్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. పల్లవి పేరెంట్స్ పేర్లు చెప్పాలని నిఖిల్ ని వెన్నెల కిషోర్ అడిగగా.. అతడు చెప్పలేక తడబడ్డాడు. దాంతో పల్లవి `పెళ్ళై పోవడంతో వాళ్ళ అవసరం తీరిపోయింది, అందుకే వారిని మరచిపోయారు` అంటూ టక్కున సెటైర్ వేసింది. అలాగే వారి లవ్ స్టోరీ గురించి వెన్నెల కిషోర్ ప్రశ్నించాడు. అందుకు పల్లవి.. నాకు ఓ శాడ్ స్టోరీ చెప్పి ప్రేమలో పడేశాడు. ఈ అబ్బాయికి ఇన్ని కష్టాలు ఉన్నాయా? అని నేను ఫీలైపోయానంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రోమో మాత్రం అదిరిపోయింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.