నందమూరి తారకరత్న ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్తు సినీలోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది నందమూరి అభిమానులు తారకరత్న మరణాన్ని దిగమింగుకోలేకపోయారు. తారకరత్న ఇక తిరిగిరాడు అన్న విషయాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.
ఆ బాధతో ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు అందరినీ కలచివేస్తున్నాయి. ఇక తాజాగా తారకరత్న కోసం బాబాయ్ బాలయ్య ఏం చేశాడో చెబుతూ అలేఖ్య రెడ్డి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య, తారకరత్న మరియు తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టా ద్వారా పంచుకుంది అలేఖ్య రెడ్డి.
ఈ సందర్భంగా ఆమె `మేము కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి బాలయ్య. కష్టసుఖాల్లో మాకు కొండంత అండగా నిలబడిన వ్యక్తి. ఆసపత్రికి తీసుకెళ్లేటప్పుడు తండ్రిలా, నీ బెడ్డు పక్కనే కూర్చుని నీకోసం పాట పాడినప్పుడు అమ్మలా వ్యవహరించారు. నువ్వు రియాక్ట్ అవుతావేమో అని నిన్ను నవ్వించడం కోసం జోక్స్ వేస్తూ సరదాగా కనిపించి.. ఎవరూ లేని సమయంలో నీకోసం కన్నీరు పెట్టుకున్నారు. చివరి క్షణం వరకు నీకోసం చాలా చేశారు. ఓబు(తారకరత్న) నువ్వు ఇంకా కొన్నేళ్లు ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం` అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తారకరత్న మరణం నుంచి త్వరగా బయటపడాలని అలేఖ్యను ఓదార్చుతున్నారు.