టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించి అభిమానులు ఊరించారు. కానీ, ఆఖరి నిమిషంలో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే తాజాగా అందరి ఉత్కంఠకు తెర దించుతూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో అట్టహంగా విడుదల కానుందని తెలిపుతూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ను బయటకు వదిలారు. ఇక కొత్త రిలీజ్ డేట్ వచ్చిందన్న ఆనందం కంటే.. శాకుంతలం కోసం ఇంకా రెండు నెలలు ఆగాలన్న బాధే ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది.
కాగా, కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణశేఖర్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. అలాగే బన్నీ కూతురు అల్లు అర్హ ఈ మూవీతో వెండితెరకు పరిచయం కాబోతోంది.