బటన్ నొక్కుడు..వై నాట్ 175?

ఈ మధ్య జగన్ ఏ సభలోనైనా, పార్టీ మీటింగులోనైనా రెండే మాటలు ఎక్కువ చెబుతున్నారు…నేను బటన్ నొక్కి..ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నానని , ప్రజలకు మంచి చేస్తున్నానని, వేరే పార్టీలకు ఓటు వేసిన వారికి డబ్బులు ఇస్తున్నామని, కాబట్టి ఎందుకు 175కి 175 సీట్లు గెలవలేమని చెప్పి..వైసీపీ నేతలు, కార్యకర్తలతో పదే పదే చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 సీట్లలో వైసీపీని గెలిపించేస్తారనే భావిస్తున్నారు.

అయితే జగన్ అలా అనుకోవడంలో తప్పు లేదు..ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట..వేల కోట్లు ప్రజల ఖాతాలో వేస్తున్నారు. ఉదాహరణకు తాజాగా మండపేట నేతలతో జగన్ సమావేశమై..దాదాపు 940 కోట్ల వరకు మండపేట ప్రజలకు ఇచ్చామని చెప్పారు. అంటే ఒక్క మండపేటకు ఇన్ని కోట్లు అంటే..మిగిలిన 174 స్థానాలకు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు. దాదాపు లక్షా 50 వేల కోట్ల వరకు సంక్షేమానికి ఖర్చు పెట్టారు. కాబట్టి ప్రజలు తననే గెలిపిస్తారని భావిస్తున్నారు.

బటన్ నొక్కుతున్న…175 సీట్లు వచేస్తాయి..ఇదే కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్ నిజమవుతుందా? అంటే కనీస రాజకీయ పరిజ్ఞానం వాళ్ళు మాత్రం..ఇది నిజం అవ్వడం కష్టమని అంటారు. ఎందుకంటే కేవలం పథకాల పేరిట డబ్బులు పంచిస్తే గెలిచేస్తామనేది కష్టం. పథకాలు ఇవ్వాలి..కానీ అదొక్కటే చేస్తే చాలదని గడపగడపకు వెళుతున్న ఎమ్మెల్యేలకు తెలుస్తోంది.

పెరిగిన పన్నుల భారం, ధరల భారం, అభివృద్ధి లేకపోవడం రోడ్లు, తాగునీరు సమస్యలు, నిరుద్యోగం, సరైన ఉపాధి లేకపోవడం..ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటి అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగితే..175 అని జగన్ కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్తితి లేదు. కాబట్టి బటన్ నొక్కితే..ప్రజలు ఈవీఏం బటన్ నొక్కి 175 సీట్లు ఇచ్చేస్తారనేది ఒక కల మాత్రమే. ఆ కల నిజమవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇకనైనా జగన్ సంక్షేమమే కాకుండా ఇతర అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారేమో చూడాలి.