ఇష్టం ఉందో లేదో.. అంతా సుస్పష్టం. అయినా.. జగన్ను కాదనలేరు. ఆయన మాటను తీసేయలేరు. అందుకే.. కష్టంగానే అక్కడ వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. జగన్ చెప్పిన నేత కోసం.. ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇది..వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. జగన్ చెప్పిన నాయకుడు.. కనీసంవీరికి రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదట. దీంతో నాయకులు ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచనలో పడ్డారు.
అదే.. టెక్కలి నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఇప్పటికే సీఎం జగన్ టికెట్ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు.. ఈ టికెట్ను ఆశించిన పేరాడ తిలక్ వంటి కీలక నాయకులకు కూడా కొన్ని ఆదేశాలు చేశారు. శ్రీనును గెలిపిస్తే.. ఎమ్మెల్సీ ఇస్తామని ఆశచూపారు. ఇక, అదేసమయంలో జిల్లా నాయకురాలుగా ఉన్న మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా ఇదే సందేశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు వీరికి పెద్ద గండమే ఎదురైంది.
ఇక, సీఎం జగన్ అంతటి వాడేచెప్పిన తర్వాత.. తప్పదు కదా అనుకున్న ఈ నాయకులు గడపగడపకు తిరుగుతున్నారు. దువ్వాడ తరఫున ఆయన తమ వద్ద ఉన్నా.. తమతో మాట్లాడకున్నా.. కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. పార్టీని గెలిపించాలని అనే బదులు దువ్వాడను గెలిపించాలంటూ.. వారు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కార్యకర్తలను పోగేసుకోవడం.. టిఫిన్లు, కాఫీలు ఇవ్వడం.. వంటివి కూడా వారి చేతి డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
ఇక, దువ్వాడ మాత్రం.. శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. తన గెలుపు కోసం.. తను కష్టపడాల్సింది ఏమీ లేదని.. అంతా పార్టీ చూసుకుంటుందనే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలోనూ లేదని… ఆయన అసమ్మతి వర్గం కక్కలేక, మింగలేక అగచాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోనీ మౌనంగా ఉంటే అధిష్టానం సీరియస్ అవుతుందనే భయం, యాక్టివ్గా ఉందామంటే.. ఇగో ఫీలింగ్. ఇలా రెండువైపులా ఇరుక్కుపోయామని నాయకులు సతమతం అవుతున్నారట. ఇదీ.. సంగతి!