వారసుడు ఎఫెక్ట్: బందరు వైసీపీలో ముసలం..!

కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం జరుగుతుంది. సరే అధికార-ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఇలాంటి రాజకీయం కామన్. కానీ ఇక్కడ అధికార పక్షంలోనే పెద్ద రచ్చ నడుస్తుందట.

ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన వారసుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని ఓ మీడియాలో కథనం వచ్చింది. అయితే పేర్ని గెలిచి మంత్రి అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పెత్తనం అంతా కిట్టు తీసుకున్నారనే విమర్శలు బాగా వచ్చాయి. ఏ పని ఉన్నా ఈయన దగ్గరకే రావాల్సిందే అని టాక్ నడిచింది. ప్రతి పనిలోనూ కిట్టు జోక్యం చేసుకునే వారు అని, అదే పేర్నికి పెద్ద మైనస్ అయిందని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

పైగా ఆ మధ్య పార్టీ ప్లీనరీ సమావేశాల్లో నెక్స్ట్ బందరులో కిట్టు పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు. అంటే పేర్ని నాని ఈ సారి పోటీకి దిగరని తెలుస్తోంది. అందుకే బందరులో కిట్టు హడావిడి ఎక్కువైందనే టాక్ వస్తుంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో ఏ పని జరగలన్నా పేర్ని నానితో పాటు, కిట్టుకు చెప్పే చేయాల్ని ఆదేశాలు ఉన్నాయట. దీంతో సొంత కార్పొరేటర్లే నానా తిప్పలు పడుతున్నారని తెలిసింది.

బందరు కార్పొరేషన్‌లో చేసే ప్రతి పని ముందుగా నాని, కిట్టులకు చెప్పి, వారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆఖరికి జగనన్న లే అవుట్లలో ఇళ్ల పట్టాలు..లబ్దిదారులకు ఇచ్చే విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఒక కార్పొరేటర్ రాజీనామాకు కూడా సిద్ధమయ్యారట.

అలాగే అధికారులతో ఒక పనిచేయించుకోలేకపోతున్నామని, డివిజన్లలో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతున్నాయని కార్పొరేటర్లు..పేర్ని ఎదుట ఆవేదన వ్యక్తం చేశారట. దీనికి పేర్ని..పార్టీలో ఇష్టం ఉన్నవారు ఉండండి…లేదంటే వెళ్లిపోండి అని సమాధానం ఇచ్చినట్లు టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఇక పేర్ని, కిట్టు వైఖరిపై కొందరు బీసీ కార్పొరేటర్లు వైసీపీఏ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి బందరులో పేర్నికి రిస్క్ ఎక్కువ కనిపిస్తోంది.