తెలుగు పరిశ్రమలో ముచ్చటైన జంట ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహేశ్బాబు-నమ్రత జంట. అవును.. వారికి పెళ్ళై 17 ఏళ్ళు దాటుతున్నా వారు ఇప్పటికీ నూతన దంపతులలాగే వ్యవహరిస్తారు. వారి మధ్య ప్రేమకు ఇదే ఓ కారణం. అందుకనే టాలీవుడ్ బెస్ట్ కపుల్స్గా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని ప్రేమ అనే అంశంతో ముడివేసింది ‘వంశీ’ అనే సినిమానే. ఇక ఎవరికీ తెలియని ఓ విషయం ఏమంటే ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.
నమ్రత మహేశ్ కంటే సుమారు నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదనే విషయం ఎంతమందికి తెలుసు? దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట.
దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. ఇక పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం.