బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్లో ఎంట్రి ఇస్తున్నాడు. ఈ సినిమాను అద్వైత్ చందన్ డైరెక్ట్ చేశాడు. లాల్సింగ్ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ట్యాగ్ తో కొందరు ట్రెండ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
వీరికి సీనియర్ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి కూడా తన గొంతు కలిపి ఆ సినిమాను బాయికాట్ చేయాలని తన ట్విట్టర్ వేదికగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్ ను చాలా తీవ్రంగా విమర్శించిన విజయశాంతి.. తన ట్విట్స్తో పరోక్షంగా తెలుగు స్టార్ హీరోలను కూడా టార్గెట్ చేశారు.
విజయశాంతి ట్విట్ చేస్తూ..” దేశాన్ని ప్రజల్ని భరతమాతని అవమానిస్తు వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్ కి నెటిజన్లు, ప్రజలు అర్థమయ్యేలా చేస్తారని” ట్వీట్ చేసింది. 2015లో అమీర్ ఖాన్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
కారణాలు ఏవైనా గతంలో అమీర్ చేసిన వ్యాఖ్యల ఫలితం ఇప్పుడు ఆయన సినిమాపై గట్టిగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ సినిమాను బాయ్కాట్ చేయాలని పోస్టులు పెడుతూ, ట్రోల్ చేస్తున్నారు. దేశం అంతటా ఈ సినిమాపై నెగిటివ్ హ్యాష్ ట్యాగ్లతో ప్రచారం నడుస్తున్నా మన తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున మాత్రం భుజాలకెత్తుకుని ప్రచారం చేయడం చాలా మందికి నచ్చడం లేదు.
అందుకే ఇప్పుడు విజయశాంతి కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ చెడుగుడు ఆడేశారు. విజయశాంతి వీరిద్దరిని ఇప్పుడు ఇలా టార్గెట్ చేయడం వెనక పాత పగ కూడా ఉందని అంటున్నారు. ఆమె ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దేశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నార్త్ హీరో సినిమాను భుజాల మీద మోయడం నచ్చకే ఇలా చేసిందని అంటున్నారు.