జగనన్న..ఆయన అన్నీ చూసుకుంటారంటా!

తెలుగు రాష్ట్రాల్లో కే‌ఏ పాల్ రాజకీయమే వేరుగా ఉంటుందనే చెప్పొచ్చు. ప్రజలు ఆయన్ని కామెడీ తీసుకున్న సరే…ఆయన మాత్రం సీరియస్ గానే రాజకీయం చేస్తారు. ఏ మాత్రం బలం లేకపోయినా…తనకు బలం ఎక్కువ ఉందని, ప్రధాని అయిపోతా…ముఖ్యమంత్రి అయిపోతా అని అంటుంటారు. అయితే పాల్ బలం ఏంటో గత ఎన్నికల్లో తేలిపోయిన విషయం తెలిసిందే…ప్రజాశాంతి పార్టీకి దారుణంగా ఓట్లు పడ్డాయి…ఒక్కో నియోజకవర్గంలో వందల ఓట్లు పడ్డ గొప్పే…ఆఖరికి నరసాపురం నుంచి పోటీ చేసిన పాల్ కు వేయి ఓట్లు కూడా దాటలేదు.

ఇలా ఏ మాత్రం బలం లేని పాల్ మాత్రం…తనదైన శైలిలో రాజకీయం చేస్తూనే ఉన్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలో సైతం ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఎంత రాజకీయం చేసిన ప్రజలు పట్టించుకునే పరిస్తితి లేదు. అయినా సరే పాల్ తగ్గడం లేదు..ఇక తాజాగా ఆయన…జగన్ కు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. జగన్‌ తనను కలవడానికి ఆసక్తి చూపడం లేదని, కానీ రహస్యంగా పిలిచినా వెళ్లి తాను కలుస్తానని, నవరత్నాలు అమలుకు జగన్‌ వద్ద డబ్బులు లేవని, తనతో చేతులుకలిపితే అన్నీతానే చూసుకుంటానని పాల్ చెబుతున్నారు.

అలాగే టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమని, పవన్‌ తనతో కలిస్తే అంతా మంచి జరుగుతుందని పాల్ చెప్పుకొచ్చారు. తాను ప్రధాని కావడమే దేశంలోని సమస్యలకు పరిష్కారమని పాల్ అంటున్నారు. ఇక పాల్ మాటలు విని నవ్వుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పొచ్చు.

అయితే పాల్ ని ఎవరైనా వెనుక ఉంది నడిపిస్తున్నారా? లేక ఆయనే ఆ తరహాలో రాజకీయం చేస్తున్నారో క్లారిటీ రావడం లేదు. కానీ ఏదేమైనా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కే‌ఏ పాల్ ఒక కామెడీ పీస్ మాదిరిగా తయారయ్యారని మాట్లాడుకునే పరిస్తితి ఉంది. మరి రాను రాను పాల్ ఇంకెంత కామెడీ చేస్తారో చూడాలి.