సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ అనేది మామూలుగా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద తమ హీరో సినిమాయే హిట్ అవ్వాలని.. తమ హీరో సినిమాకే ఎక్కువ కలెక్షన్లు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు నడుస్తోందంటూ ఇంటర్నెట్ యుగం కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక ఘర్షణకు దిగుతూనే ఉంటారు. తమకు నచ్చని హీరోల సినిమాలు, రికార్డులపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి వదులుతూ ఉంటారు.
టాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎన్టీఆర్ – కృష్ణ టైం నుంచే ఉంది. ఆ తర్వాత బాలయ్య వర్సెస్ చిరంజీవి మధ్య కూడా ఇది ఎక్కువుగా కొనసాగింది. ఇక ఇప్పుడు బన్నీ వర్సెస్ మహేష్, మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటోంది. తాజాగా మహేష్బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది.
ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది ? ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుంది ? అనే వాటిపై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పవన్ నటించిన గతేడాది సినిమా వకీల్సాబ్, ఈ యేడాది నటించిన భీమ్లానాయక్ సినిమాల రికార్డులను సర్కారు వారి పాట బ్రేక్ చేస్తుందని మహేష్ అభిమానులు చెపుతున్నారు.
కారణాలు ఏవైనా వకీల్సాబ్కు, భీమ్లానాయక్కు టాక్ బాగున్నా ఆశించిన వసూళ్లు రాలేదు.ఈ రెండు చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ రెండు సినిమాల వసూళ్లు తమ హీరో సినిమా ఫస్ట్ వీకెండ్కే బ్రేక్ చేస్తుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రికార్డులు తునాతునకలు అవుతాయని భయపడే పవన్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట సినిమాను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
తమ హీరోకు రు. 100 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఐదు ఉంటే.. పవన్కు రెండు మాత్రమే ఉన్నాయని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా సర్కారు వారి పాట బుకింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది.