ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడమో లేదా ఏదోలా న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు ఇండస్ట్రీలో చాలా మంది సినీ నటీనటులు జగన్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. చాలా మంది ప్రత్యక్షంగానే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేశారు. పార్టీ ఏకంగా 151 సీట్ల బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
ఈ క్రమంలోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వికి జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతిష్టాత్మకమైన టీటీడీ భక్తి ఛానెల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆయన చుట్టూ వివాదాలు రావడంతో కొద్ది రోజులకే ఆయన ఆ పదవి వదులుకున్నారు. ఇక ఇప్పుడు మరో సినీ నటుడు ఆలీకి కూడా పదవి ఖరారైంది. కొద్ది రోజుల క్రిందటే సినీనటులతో కలిసి జగన్ను ఆయన కలిసినప్పుడే ఆలీకి జగన్ శుభవార్త చెప్పారు.
ఇక తాజాగా జగన్ ఆలీని ఏపీ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఆలీకి రాజ్యసభ ఇస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఆలీకి రాజ్యసభ ఇస్తే నిజంగా అది పెద్ద పదవే అయ్యి ఉండేది. ఇక ఇప్పుడు ఆలీని వక్ప్ బోర్డ్ చైర్మన్ పదవి దక్కనుంది. ఇక ఈరోజే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది.