గౌత‌మ్‌రెడ్డి స్థానంలో కొత్త మంత్రి ఎవ‌రంటే…!

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అధికార పార్టీలో తీవ్ర నిర్వేదం అలుముకుంది. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌత‌మ్ జ‌గ‌న్‌కు ఎప్ప‌టి నుంచో స్నేహితుడు. పైగా యంగ్ అండ్ డైన‌మిక్ పారిశ్రామిక‌వేత్త కావ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ క‌ట్ట‌బెట్టారు. మ‌రో రెండు, మూడు నెల‌ల్లో జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో స‌డెన్‌గా ఆయ‌న గుండెపోటుతో మృతిచెందారు. చిన్న వ‌య‌స్సులోనే గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణం వైసీపీకి, వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌కు తీర‌నిలోటే..!

ఇక జ‌గ‌న్ ఎలాగూ త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గాన్ని మారుస్తారు. ఇక ఇప్పుడు గౌత‌మ్‌రెడ్డి ప్లేస్ ఎవ‌రికి ఇస్తారు ? అన్న‌దానిపై వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌ముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. గౌత‌మ్‌రెడ్డి రెడ్డి వ‌ర్గం నేత కావ‌డంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా రెడ్డి నేత‌కే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు. మంత్రి ప‌ద‌వి కోసం ఎప్ప‌టి నుంచో ఫైట్ చేస్తోన్న చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే. రోజాతో పాటు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక మరో టాక్ ప్ర‌కారం గౌత‌మ్‌రెడ్డి నిర్వ‌హించిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను రోజాకు, ఐటీ శాఖ‌ను కేతిరెడ్డికి ఇస్తార‌ని అంటున్నారు. అయితే రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంలో జ‌గ‌న్‌కు చాలా అభ్యంత‌రాలు ఉన్నాయి. అవ‌న్నీ బ‌లంగా ప‌నిచేస్తే ఆమెకు మంత్రి ప‌ద‌వి రాదు. అలాంట‌ప్పుడు ఈ రెండు శాఖ‌లు కూడా కేతిరెడ్డి ఖాతాలోకే వెళ‌తాయంటున్నారు.

ఇక ఐటీ శాఖ కోసం కేతిరెడ్డి పేరుతో పాటు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ పేరు కూడా వినిపిస్తోంది. విడ‌ద‌ల రజనీ ఎన్నారై రిటర్న్. ఆమె సాఫ్ట్ వేర్ రంగం నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పైగా స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అండ‌దండ‌లు ఆమెకు పుష్క‌లంగా ఉన్నాయంటున్నారు.