బొమ్మ ప‌డ‌లేదు.. అప్పుడే వ‌సూళ్ల‌లో టాప్ లేపిన భీమ్లానాయ‌క్‌

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవ‌ర్సీస్‌లోనూ భీమ్లానాయ‌క్ హంగామా మామూలుగా లేదు. అయ్యారే – అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమాల ద‌ర్శ‌కుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ మూవీ విడుదలకు ముందే యుఎస్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఇంకా థియేట‌ర్లలో బొమ్మ ప‌డ‌కుండానే భీమ్లానాయ‌క్ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ ద్వారా ఈ చిత్రం 286 లొకేషన్ల‌లో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టింది. బొమ్మ ప‌డ‌కుండానే హాఫ్ మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు అంటే మామూలు సంచ‌ల‌నం కాదు. ఈ యేడాది ఏ టాలీవుడ్ సినిమాకు అయినా ఇదే పెద్ద రికార్డుగా చెప్పాలి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌.. ఈ సినిమాకు సంభాష‌ణ‌లు అందిస్తుండ‌డం కూడా సినిమాపై హైఎక్స్‌పెక్టేష‌న్ల‌కు ఒక కార‌ణం.

ఇక గ‌తేడాది వ‌చ్చిన వ‌కీల్‌సాబ్ సినిమా త‌ర్వాత క‌రోనా చుట్టేసింది. ఆ సినిమా కూడా కంప్లీట్ ప‌వ‌న్ స్టైల్ సినిమా కాదు. కొన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా మిస్ అయ్యాయి. ఇప్పుడు భీమ్లానాయ‌క్ ప‌క్కా ప‌వ‌ర్ ఫుల్ ప్యాక్‌డ్ సినిమాగా వ‌స్తోంది. దీంతో ఫ‌స్ట్ డేనే ఎలాగైనా ప‌వ‌న్ సినిమా చూసేయాల‌న్న ఆతృత‌తో బుకింగ్స్ బాగా న‌డుస్తున్నాయి.

ఇక త్రివిక్ర‌మ్ హ్యాండ్ కూడా సినిమాకు ఉంద‌నే అంటున్నారు. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. థ‌మన్‌ సంగీతం అందించారు.