హ్యాట్రిక్ హిట్స్ తో అదుర్స్ అనిపించిన సొట్టబుగ్గల సుందరి..

కృతి శెట్టి.. ఈ ఏడాది ఎంతో మంది హీరోయిన్లు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. ఈమె మాత్రమే ఫుల్ సక్సెస్ అయ్యింది. వరుసగా మూడు సినిమాల్లో నటించి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఈ దెబ్బతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా నిలిచింది. అంతేకాదు.. తను నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకోవడంతో కృతి శెట్టిది గోల్డెన్ లెగ్ అంటూ వేనోళ్ల పొగుడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్వింగ్ లో ముందుకు సాగుతుంది ఈ సొట్టబుగ్గల సుందరి.

కరోనా అనంతరం వచ్చిన ఉప్పెన సినిమా ఓరేంజిలో విక్టరీ కొట్టింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో ఆమె చేసిన బేబమ్మ క్యారెక్టర్ జనాలన మదిలో నిలిచిపోయింది. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మను జనాలు ఓన్ చేసుకున్నారు.

తొలి సినిమా విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మయికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు ఓకే చెప్పాలో తెలియక కొన్ని సినిమాలను వదులుకుంది కూడా. అదే సమయంలో కరోనా పూర్తిగా తగ్గక ముందే నానితో కలిసి శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటించింది. అందులో రొమాన్స్ చేసి మెప్పింది. ఈ సినిమా కూడా విజయం సాధించింది. దీంతో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా సంక్రాంతికి జనాల ముందుకు వచ్చింది. చైతన్యతో కలిసి బంగార్రాజులో జనాలను బాగా ఆకట్టుకుంది. ట్రెడిషనల్ డ్రెస్సులో సర్పంచ్ నాగ లక్ష్మి క్యారెక్టర్ చేసి జనాల మెప్పు పొందింది. ఆమె పాత్రను జనాలు కూడా బాగా ఆదరించారు. ఈ సినిమా హిట్ తో వరుసగా మూడు హిట్లు అందుకుని తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.