ప్రభాస్‌ దెబ్బ‌కు ఎంతో కృంగిపోయా..నిత్యా మీన‌న్‌ ఆవేద‌న‌!

నిత్యా మీన‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాళ భామ‌.. మొద‌టి చిత్రంతోనే మంచి న‌టిగా గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత త‌న‌దైన అందం, అభిన‌యంతో అతి త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన నిత్యా మీన‌న్‌..తెలుగుతో పాటు టు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది.

తాజాగా డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన `స్కైలాబ్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిత్యా మీన‌న్‌.. మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా `భీమ్లానాయ‌క్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మొద‌ట్లో ఓ మీడియా స‌మావేశంలో `ప్రభాస్ గురించి చెప్పమంటే` ఆయనెవరో నాకు తెలియదని నిత్యా మీన‌న్ తెలిపింది.

అప్ప‌ట్లో ఇది పెద్ద ఇష్యూగా మారింది. నిత్యా మీన‌న్‌ను తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ ఇష్యూపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీన‌న్ స్పందిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. నిత్యా మీన‌న్ మాట్లాడుతూ.. `ఇండస్ట్రీలో నాకు దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే. ఆ ఇష్యూ నన్నుఎంతో కృంగిదీసింది. అప్పుడే నేను కొత్తగా వచ్చాను.. తెలుగు రాదు, తెలుగు సినిమాలు కూడా చూడలేదు.

ఏదో పెద్ద హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి వాళ్లు తెలుసుకానీ.. ప్రభాస్ గురించి పెద్దగా తెలియ‌దు. పోని అప్పుటకి ఆయన బాహుబలి స్టార్ కూడా కాదు. దీంతో ప్రభాస్ ఎవరో నాకు తెలియదని అనడంతో దానిపై పెద్ద రాద్ధాంతం చేశారు. నేను ఏదో తప్పు చేసినట్టుగా మీడియా వారు న్యూస్ క్రియేట్ చేశారు. ఇక అప్ప‌టి నుంచీ మీడియా ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకున్నాను` అని చెప్పుకొచ్చింది.