దొంగ కారణంగా కొట్టుకునేందుకు రెడీ అవుతున్న హీరోలు

ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే, ఏదో ఒక సీన్‌లో వారిద్దరు కొట్టుకోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే పాత్రను చేయడం మీరు చూశారా? పోనీ.. ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలు తీయడం మీరు చూశారా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగునాట ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలంటే ఎలాంటి భయం ఉండేదో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి దొంగల్లో పేరుగాంచిన ఓ గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి పలు కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ గజదొంగకు సంబంధించిన బయోపిక్ టాలీవుడ్‌లో వివాదానికి కేరాఫ్‌గా మారినట్లు కనిపిస్తుంది. ఈ గజదొంగ బయోపిక్ చిత్రంగా మాస్ రాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాను చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇదే కథతో మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ‘స్టువర్ట్‌పురం దొంగ’ అనే టైటిల్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే బెల్లంకొండ ప్రకటించాడు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే దర్శకుడు వంశీకృష్ణ తొలుత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు ఈ కథతో వెళ్లగా, ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇదే కథను మాస్ రాజా రవితేజతో చేసేందుకు వంశీకృష్ణ రెడీ అయ్యాడు. కానీ బెల్లంకొండ బాబు అదే కథతో సినిమా చేస్తుండటంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ ఏం చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఈ గజదొంగ కారణంగా రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్‌ల మధ్య ఎలాంటి వివాదం రేగుతుందా అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.