కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పునీత్ ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎందరికో సాయపడ్డాడు. ఇప్పుడు పునీత్ మరణంతో..ఆయన నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది.
అయితే ఇలాంటి తరుణంలో పునీత్ను స్ఫూర్తిగా తీసుకుని కొందరు సినీ తారలు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలె హీరో విశాల్.. పునీత్ చదివిస్తున్న 1800 మంది పేద విద్యార్ధుల బాధ్యతను తీసుకోగా.. తాజాగా ప్రణీత కూడా గొప్ప మనసు చాటుకుని నెటిజన్లను ఫిదా చేసింది. `ప్రణీత ఫౌండేషన్` పేరుతో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు ఒకరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనుంది.
బెంగళూరు నగరంలోని అంబేడ్కర్ భవనంలో బుధవారం (నవంబర్3)న ఈ మెడికల్ క్యాంపు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగే ఈ వైద్య శిబిరంలో ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చనని ప్రణీత తెలిపింది. ఈ సందర్భంగా పునీత్ సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్న ప్రణీత.. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.