పవన్ కాబట్టి సరిపోయింది.. ఇంకొకరైతే తన్ని తరిమేసేవారు.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!

స్టార్ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా కొండ పొలం అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందుగానే క్రిష్ ఏఎం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ కి కూడా పాజిటివ్ రావడంతో ఆయన కూడా షూటింగులకు దూరంగా ఉన్నారు.

ఆ సమయంలో క్రిష్ కొండపొలం అనే నవల చదవడం.. అది విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ కు చెప్పడంతో.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు ఇచ్చిన బ్రేక్ సమయంలో కొండ పొలం సినిమా షూటింగ్ చేసుకునేందుకు ఆయన అనుమతి ఇచ్చాడు.

దీనిపై తాజాగా క్రిష్ మాట్లాడుతూ ‘ హరి హర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూ.వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అలా ఉండగానే మరో సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని.. మరో హీరోకు చెప్పి ఉంటే ఈ పాటికి నన్ను తన్ని తరిమి వేసే వారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను అర్థం చేసుకుని..మరో మూవీ చేసేందుకు ప్రోత్సహించారు.

ఇండస్ట్రీకి ఈ సమయంలో సినిమా ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని హరిహర వీరమల్లు నిర్మాత రత్నం గారికి చెప్పా. ఆయన కూడా అంగీకారం తెలపడంతో కొండ పొలం పట్టా లెక్కింది.’ అని క్రిష్ తెలిపారు. కొండపొలం సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే.. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పనులు కూడా చక్క పెడుతున్నట్లు ఈ సందర్భంగా క్రిష్ తెలిపాడు. ఇంకొక సీన్ చిత్రీకరిస్తే సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తవుతుందని ఆయన చెప్పాడు.