కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడానికి ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. `అప్పూ.. మిస్.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు.
మరోవైపు పునీత్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
అయితే పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు మున్నీరైపోయారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ తోపాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టేడియంలోనే ఆయన అంత్యక్రియలూ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న పునీత్ రాజ్కుమార్ కుమార్తె వచ్చిన తరువాత అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.