నేటి నుంచి ఐపీఎల్ సందడి షురూ కాబోతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి జరగబోయే మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడబోతున్నారు. రెండూ బలమైన జట్లు కావడంతో.. క్రికెడ్ ప్రియులు మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. గత ఏడాది మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఈ మ్యాచ్లను నిర్వహించనున్నారు. అక్టోబరు 8న లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్ జరగనుండగా.. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఆర్సీబీ ఢీకొడుతుంది. మొదటి క్వాలిఫైయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్లో.. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్లు అక్టోబరు 11, అక్టోబరు 13న షార్జాలో నిర్వహించనున్నారు.
ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా అక్టోబరు 15న జరుగుతుంది. మరో విషయం ఏంటంటే..ఈసారి స్టేడియంలోకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి పాయింట్ల పట్టికలో ఏ జట్లు.. ఏ పొజీషన్లో ఉన్నాయంటే.. ఢిల్లీ 12 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చివరి నాలుగు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. సీజన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే.