శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే ..మరో మార్గం ఏముందంటే..!

తిరుమలలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు టీటీడీ బోర్డు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉండడంతో వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.ఇప్పటి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే వారు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆ సర్టిఫికెట్ చూపించలేకపోతే మూడు రోజులకు ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలని లేకపోతే నెగిటివ్వచ్చినట్లు సర్టిఫికెట్ చూపిస్తేనే శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. కరోనా ను నియంత్రించేందుకు ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు.

ఏపీలోని 13 జిల్లాల్లో అన్ని జిల్లాల కంటే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉంది.వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుండడంతో వివిధ వేరియంట్ల వైరస్ కూడా తిరుపతిలో ప్రబలుతోంది. గత ఏడాది తిరుపతిలో డెల్టా వేరియంట్ కేసు కూడా నమోదైయిన సంగతి తెలిసిందే. శ్రీవారి భక్తులను కరోనా నుంచి కాపాడేందుకు, స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.