మంత్రి పేర్ని నాని కాన్వాయ్ కి ఎదురొచ్చిన పవన్ ఫ్యాన్స్.. ఆ తర్వాత ఏమైందంటే..!

వైసీపీ వర్సెస్ జనసేన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ వరుసబెట్టి పవన్ కళ్యాణ్ కు కౌంటర్లు ఇచ్చారు.

ఆ తర్వాత సినీ నటుడు పోసాని కృష్ణమురళి రెండు రోజులపాటు వరుసగా ప్రెస్మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ పై దారుణంగా విమర్శలు చేశారు. వివాదంలోకి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా లాగి వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని కృష్ణమురళి నివాసం పై రాళ్ల దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి పోసాని కృష్ణమురళి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.

ఇదిలా ఉండగా మంత్రి పేర్ని నాని ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్నారు. పేర్ని నాని వెళ్తున్న కాన్వాయ్ ని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పందించిన పోలీసులు పవన్ కళ్యాణ్ అభిమానులు మంత్రి కాన్వాయ్ వైపు వెళ్లకుండా పక్కకు లాగారు.