కొత్త పిక్: గుడ్డివాడికి గురిపెట్టిన మిల్కీ బ్యూటీ

టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాలకు కొదువే లేదనే సంగతి మనకు తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను స్టార్ హీరోలు సైతం రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో వాటికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో అనేక రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘నారప్ప’ చిత్రం తమిళంలో తెరకెక్కిన అసురన్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో మరిన్ని రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన చిత్రం ‘మాస్ట్రో’ గురించి. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘అంధాధున్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ సినిమాను అనేక భాషల్లో రీమేక్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే తెలుగులో యంగ్ హీరో నితిన్ ఈ సినిమాను మాస్ట్రో పేరుతో తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తుండగా, ఈ సినిమాలో అందాల భామలు నభా నటేష్, మిల్కీ బ్యూటీ తమన్నాలు నటిస్తున్నారు. కాగా నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో తమన్నా చేతిలో తుపాకీ పట్టుకుని నితిన్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపించింది. అయితే నితిన్ గుడ్డివాడి పాత్రలో కనిపిస్తుండటంతో అతడికి ఇదంతా తెలియదన్నట్లుగా ఉన్నాడు. మొత్తానికి అంధాధున్ చిత్రాన్ని చూసిన వారికి ఈ సినిమా మరోసారి చూసినట్లుగా అనిపించవచ్చుగాని, ఆ సినిమాను చూడని వారిని మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా థ్రిల్లింగ్ మూవీగా అలరించడం ఖాయం.