నవీన్ పోలిశెట్టికి అరుదైన గౌరవం..?

కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని నిరూపించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఫన్నీ గాయ్‌గా నవీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నవీన్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించాడు.

అదేంటంటే..తనకు బెస్ట్ యాక్టర్2గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నెటిజన్లు ఈ విషయం తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలోనే అవార్డును జూరీ వారు తన ఇంటికి పంపించినట్లు హీరో నవీన్ పొలిశెట్టి పేర్కొన్నారు. జోగిపేట శ్రీకాంత్‌కు అవార్డు వచ్చిందోచ్ అంటూ కొందరు నవీన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. నవీన్ నెక్స్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్‌తోనే ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.