ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో మంచి నటుడుగా ఫ్రూవ్ చేసుకున్న సంతోష్.. ఇటీవల విడుదలైన ఏక్ మినీ కథతో హిట్ అందుకున్నాడు.
ఈ హిట్తో మంచి జోరు మీదున్న సంతోష్ వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. అభిషేక్ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్ చేస్తున్న తాజా చిత్రం ప్రేమ్ కుమార్. రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు.
సాధారణంగా మన తెలుగు సినిమాల్లో, క్లైమాక్స్లో హీరో వచ్చి పీటల మీదున్న హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పీటల మీదున్న అబ్బాయి గురించి ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్ ఏం చేశాడన్నది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. మొత్తానికి ఇంట్రస్టింగ్ కథతో వస్తున్న సంతోష్.. మళ్లీ హిట్ కొట్టేస్తాడా.. లేదా..? అన్నది చూడాలి.