రాష్ట్రంలో మే 5వ తేది నుంచి విధించిన కర్ఫ్యూ ద్వారా ఆ వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాజాగా జరిగిన సదస్సులో కొవిడ్, అర్బన్ క్లినిక్స్, ఉపాధిహామీ పనులు, ఇళ్లపట్టాలు, ఖరీఫ్ సన్నద్ధత లాంటి వాటిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా చాలా తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు లాంటివి ఇకపై జీవితంలో ఓ భాగం కావాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే ప్రతి వారం కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వారికి పరీక్షలు చేసి వైద్యం అందించాలన్నారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు 89 శాతం మంది తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందుముందు థర్డ్వేవ్ వస్తుందో, లేదో.. మనకు తెలియదు. వచ్చినప్పుడు మాత్రం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలను ఆయన తెలిపారు. థర్డ్వేవ్ లో ముఖ్యంగా పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని కాబట్టి.. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోని తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక అధికారులు దృష్టిపెట్టాలని.. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అతి త్వరలో పిల్లల వైద్యం కోసం 3 అత్యాధునిక ఆస్పత్రులను తీసుక రాబోతునట్లు సీఎం పేర్కొన్నారు. అందుకు అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని సూచించారు.