కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్క‌డితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన వారికి లేద‌న‌కుండా ఇప్ప‌టికి కూడా సాయం చేస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. క‌రోనా రోగులు ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ దొర‌క‌క ప్రాణాలు కోల్పోతున్నారు.

దీంతో వారి బాధ‌ను చూడ‌లేని సోనూసూద్‌ వీలైనంత మందికి ఆక్సిజ‌న్ అందించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే యూఎస్‌, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజ‌న్ ఫ్లాంట్లు తెప్పించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ ఫ్లాంట్ల‌ను వివిధ రాష్ట్రాల్లోని అవ‌స‌ర‌మైన ఆస్ప‌త్రుల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కరోనాతో చాలా మంది ఆక్సిజన్ లేక, బెడ్స్ దొరక్క చనిపోతున్నారని కంటతడి పెట్టారు. తన తల్లిదండ్రులు ఒక‌వేళ వారు ఇప్పుడు ఉండి ఉంటే అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో బెడ్స్ దొర‌క్క‌, ఆక్సిజ‌న్ లేక ఇబ్బందులు ప‌డితే అది చూసి తన గుండె ముక్క‌లయ్యేది అని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు.