ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్ బిజినెస్లో రూ. 7 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. శ్రీవాసలం బిజినెస్ గ్రూప్కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్ని అరెస్ట్ చేశారు. గురువారం వీఏ శ్రీకుమార్ మీనన్ ను కోర్టులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాన్ని కోర్టు తిరస్కరించింది. ఉత్తర పాలక్కాడ్ జిల్లాలో సదరు డైరెక్టర్ నివాసంలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ప్రముఖ నటి మంజు వారియర్ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో మీనన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. మోహన్లాల్- మంజువారియర్ నటించిన ‘‘ఒడియన్’’ సినిమాతో డైరెక్టర్గా మీనన్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.