ముక్కు మొఖం తెలియని వారితో చాటింగ్ చేయవద్దని పోలీసులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా కొందరు వినడం లేదు. అవతలి వ్యక్తి అమ్మాయి అయితే చాలు గుడ్డిగా నమ్మి ఫాలో కావడమే. తరువాత సమస్యల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇక మగవారి వీక్నెస్ను ఆసరాగా చేసుకున్న ఓ కిలేడి ఏకంగా అదే పనిగా పెట్టుకుంది. తొలుత మారుపేర్లతో ఎఫ్బీలో పరిచయం పెంచుకోవడం, తరువాత వాట్సాప్లో నగ్నంగా వీడియో చాటింగ్లు చేయడం, వాటిని అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ మొదలు పెట్టింది. అక్కడితో ఆగకుండా తాను మోసగించిన యువకుల ఫోటోలను చూపి పెండ్లి సంబంధాలు చూపిస్తానని చెబుతూ అమ్మాయిల తల్లిదండ్రులను సైతం బురిడి కొట్టించడం గమనార్హం. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ కిలాడీ బండారం బయటపడింది. అధికారులు తెలిపిన కథనం ప్రకారం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అనేక మారు పేర్లతో యువకులను మోసం చేస్తున్నది. తొలుత ఇందు దాసరి పేరిట హైదరాబాద్ కు చెందిన బొమ్మెల వెంకటేష్తో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుంది. అటు తరువాత అతనితో నగ్నంగా వీడియో చాటింగ్ చేయడంతో పాటు, ఆ ఫొటోలను తన వద్ద భద్రపర్చుకుంది. ఇదే విధంగా వెంకటేశ్ బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్ అనే వ్యక్తితో సైతం మహేశ్వరి పేరుతో ఎఫ్బీలో పరిచయం పెంచుకొని ఫోటోలను సేకరించింది. అటు తరువాత తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులకు దిగడం మొదలు పెట్టింది. ఇక అదేవిధంగా మహేశ్వరి రెడ్డి పేరుతో కూకట్ పల్లి కి చెందిన మణికంఠతో ఎఫ్బీలో పరిచయం చేసుకుని ఫోటోలు సంపాదించి, అతనిని బెదిరించి రూ. 4 లక్షల 50 వేలు వసూలు చేసింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉన్నది. ఆ తర్వాత ఘట్ కేసర్ పరిధిలో అబ్బాయి మాదిరిగా ఒక అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుంది. తన వద్ద ఉన్న వేరే వ్యక్తుల ఫోటోలు చూపించి లవ్ చేస్తున్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత ఆమె యువతిని బెదిరించి ఒక రూ.లక్షా 75 వేలు వసూలు చేయగా బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదయింది.
ఖమం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పారావు అనే వ్యక్తి కూతురుకి పెండ్లి సంబంధము ఉన్నదని, అప్పారావుకు బంధువు అయిన కిలాడి లేడీ జయంత్ అనే వ్యక్తి ఫోటోలు చూపిస్తూ వాళ్లకు మాత్రం అతని పేరు కృష్ణహర్ష అని చెప్పి, వాళ్ల సోదరుడు వెంకటేష్ సిఐ ఉద్యోగం చేస్తున్నాడు, తాను సంబంధం కుదిరిస్తానని చెప్పడమే కాక, వాళ్ళు ఏడు లక్షలు అడుగుతున్నారని చెప్పి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నదని చెప్పారు. తరువాత వారు మోసపోయినట్లుగా తెలుసుకొని కేసు పెట్టినట్లు తెలిపారు. ఇక ఈ కిలేడి లీలలు ఇక్కడితో ఆగలేదు. నాగలక్ష్మి అనే అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నానని చెప్పి వాళ్లకు తన వద్ద ఉన్న అనుదీప్ పటేల్ ఫోటోలు చూపించింది. అతని పేరు పేరు కార్తీక్ అని చెప్పడమే గాకుండా తానే అబ్బాయిమాదిరిగా మాటా్లడి వారిదగ్గర రూ. మూడు లక్షలు వసూలు చేసింది. ఇలా మొత్తం రూ.11 లక్షల 70 వేలు వసూలు చేసుకొని తప్పించుకొని నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో తలదాచుకుంటుండగా పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. కిలేడిపై కరింనగర్ షీ టీమ్, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ గౌడ్, నల్లగొండ వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్ వెల్లడించారు.