ఎంఎస్ రాజు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘7 డేస్ 6 నైట్స్’ చిత్ర విశేషాలను వెల్లడించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.
దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమర్థ్ గొల్లపూడి అందిస్తున్నారు. విహార యాత్రకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఎంఎస్ రాజు తెలిపారు. గతంలో ఎంఎస్ రాజు శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలను నిర్మించారు.