టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకు ముందే.. మరో ప్రాజెక్ట్ను లైన్ పెట్టాడట. యాత్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహి.వి రాఘవ్.. ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
పోలీస్ ఆఫీసర్స్ అయిన ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అట. అయితే రాఘవ్ ఇటీవల నితిన్ ను కలిసి ఆ కథ చెప్పగా.. నితిన్కు అది బాగా నచ్చిందట. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. పవర్ పేట తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.