సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్ సుమారు ఆరు రోజుల తరువాత ఎట్టకేలకు కదిలింది. ఓడ ముందు భాగం కూరుకుపోయిన చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు ద్వారా తవ్వి, నౌక కింద నీటిని పంప్ చేశారు. వీటికి సముద్రపు పోటు కూడా తోడై ఎట్టకేలకు కదిలింది. ప్రస్తుతం దీని ప్రయాణం సాఫీగా సాగుతోందని మారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇంచ్ కేప్ వెల్లడించింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారని, అడ్డంగా ఉన్న ఈ నౌకను 80% సాధారణ స్థితికి తీసుకొచ్చాం. ఆ తర్వాత పూర్తిగా నీటి పై తేలింది అంటూ సూయిజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రబీ తెలిపారు.
ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన కారణంగా నౌక ఏమైనా దెబ్బతిందా అన్నది ఇంకా పరిశీలిస్తారు. అవసరమైతే తగిన మరమ్మతులు చేపట్టి, ఇప్పటికే వెళ్లాల్సి రోటెండమ్కే దాన్ని తీసుకువెళ్తామని యాజమాన్య సంస్థ తెలిపింది. ఎవర్ గివెన్ను ప్రస్తుతం గ్రేట్ బిట్టర్ లేక్ వైపు తీసుకెళ్తున్నారు.